వరంగల్ నగరంలోని అంబేద్కర్నగర్ వాసులు పక్కా ఇండ్లు లేక ఇలా గుడిసెల్లో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వాన కాలంలో అష్టకష్టాలు పడుతున్నారు. సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో వీరి జీవితాలు మారనున్నాయి. ఇలాంటి నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం సకల వసతులతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పైసా ఖర్చు లేకుండా పేదల సొంతం కానున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ.94.19 కోట్లతో 4,417 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే 800 ఇండ్లు పూర్తికాగా మరో 2,632 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 1,185 ఇళ్ల నిర్మాణాల పనులు త్వరలో మొదలు కానున్నాయి. కాగా పూర్తయిన ఇండ్లను రెండు నెలల్లోపే లబ్ధిదారులకు కేటాయించనున్నారు. – వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి