హైదరాబాద్లో 1921 నవంబర్ 11, 12వ తేదీల్లో నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల మహాసభ జరిగింది. మహర్షి కార్వే ఈ సభకు అధ్యక్షత వహించారు. సభాకార్యక్రమాలు ఎక్కువగా ఉర్దూ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో జరిగాయి. ప్రతినిధుల్లో ఒకరైన అల్లంపల్లి వెంకటరామారావు తెలుగులో ఓ తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే మరాఠీ ప్రతినిధులు అల్లరి చేసి అడ్డుకున్నారు. తెలుగునాడు మధ్యన గల రాజధానిలో తెలుగు తీర్మానం ఇలా తిరస్కారానికి గురికావడం అక్కడున్న తెలుగువారికి అవమానంగా అనిపించింది. ఆ రాత్రే వారంతా కలిసి ‘ఆంధ్ర జన సంఘాన్ని’ స్థాపించారు.
తొలి సభ్యులుగా నమోదైన 12 మందిలో మాడపాటి హనుమంతరావు, రామకృష్ణారావు, ఎం.నర్సింగరావు, ఆదిరాజు వీరభద్రరావు లాంటివారున్నారు. అనతికాలంలోనే సభ్యత్వం వందకు చేరుకుంది. 1922 ఫిబ్రవరి 14న సంఘం తొలి సమావేశం కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. మాడపాటి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తెలంగాణాలో సామాజిక, సాంస్కృతిక అభ్యున్నతికి కృషిచేయడం సంఘం మూల లక్ష్యంగా ఉండేది. తర్వాతి కాలంలో ఈ సంఘం ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’లో విలీనమైంది.