భారత జాతీయోద్యమంలో ఆ హత్య ఓ సంచలనం. దేశ యువతలో కొత్త ఉత్తేజాన్ని నింపిన సంఘటన. నాసిక్ కలెక్టర్ జాక్సన్ను హైదరాబాద్ సంస్థానంలోనిసీక్రెట్ సొసైటీ సభ్యుడు అనంత లక్ష్మణ్ కన్హెరె తుపాకీతో కాల్చి చంపడం బ్రిటిష్ ఇండియా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఈ హత్య ‘నాసిక్ కుట్ర’గా చరిత్రకెక్కింది.
ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి ఏఎంటీ జాక్సన్ బొంబాయి ప్రావిన్స్ (నేటి మహారాష్ట్ర ప్రాంతం)లోని నాసిక్ జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. ఆంగ్లేయుడే అయినా జాక్సన్.. భారతీయ సంస్కృతి, చరిత్రను అధ్యయనం చేసేవాడు. మన జానపద కళలను వీక్షించేవాడు. పురాణాలు చదివేవాడు. సంస్కృతం నేర్చుకున్నాడు. తన పేరుని పండిత్ జాక్సన్గా మార్చుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో జాక్సన్ ఎలా ఉన్నా, ఉద్యోగ బాధ్యతల్లో బ్రిటిష్ వారి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండేవాడు. అకారణంగా ఒక భారతీయ రైతును నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపిన బ్రిటిష్ సైనికాధికారిపై నమోదైన కేసును రద్దు చేశాడు. ‘వందేమాతరం’ నినాదాలు చేసిన యువతపై దేశద్రోహ నేరం మోపి, జైలుకు పంపాడు. ప్రభుత్వం కేసులు పెట్టిన విప్లవకారుల తరఫున వాదించిన న్యాయవాది బాబాసాహెబ్ ఖరేని కోర్టు నుంచి బహిష్కరించాడు. అతని ఆస్తులు జప్తు చేయించి, అతడిని జైలుకి పంపాడు.
లాస్ట్ చాన్స్: బిటిష్ ప్రభుత్వం జాక్సన్కి పదోన్నతి కల్పించి, బొంబాయి నగర కమిషనర్గా బదిలీ చేసింది. నాసిక్ పట్టణంలో 1909 డిసెంబరు 21న విజయానంద్ థియేటర్ దగ్గర కలెక్టర్ జాక్సన్ వీడ్కోలు సభ జరుగుతోంది. కాగా, జాక్సన్ను అంతం చేసేందుకు సీక్రెట్ సొసైటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. నాసిక్ వీడిపోతే హత్య చేయడం సాధ్యం కాదని ఇదే చివరి అవకాశంగా భావించారు. ఆ సభలో జాక్సన్ ‘సంగీత శారద’ నాటకం తిలకిస్తున్నాడు. ఆ సమయంలో జాక్సన్కు అతిసమీపంగా నిల్చుని 17 ఏళ్ల అనంత్ లక్ష్మణ్ కన్హెరె తుపాకీతో కాల్చాడు. జాక్సన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్య బ్రిటిష్ ఇండియాలో పెద్ద సంచలనం. ఇది ‘నాసిక్ కుట్ర కేసు’గా చరిత్రకెక్కింది.
ఔరంగాబాదే అడ్డా: హత్య చేసిన వెంటనే అనంత్ లక్ష్మణ్ కన్హెరే పోలీసులకు దొరకిపోయాడు. పథకం ప్రకారం జాక్సన్ కాల్చిన వెంటనే తనను తాను కాల్చుకుని చనిపోవాలనుకున్నాడు. కానీ, వీలు కాలేదు. ఈ హత్యకు అనంత లక్ష్మణ్తోపాటు నాసిక్కి వచ్చిన మిగతా ఇద్దరు నాసిక్ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో ఈ ఇద్దరు చెప్పిన మాటలు తెల్ల దొరల గుండెల్లో గుబులు పుట్టించాయి. అవేమిటంటే?..
బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమి కొట్టేందుకు, దేశ స్వాంతంత్య్రం కోసం యువతను ప్రాణత్యాగాలకు సిద్ధం చేయడం కోసం నడిచే సంస్థలో ఈ ముగ్గురూ సభ్యులు. నాసిక్లో ఏర్పాటైన సీక్రెట్ సొసైటీ (నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్లో) ప్రవాసంలో ఉన్నవారికి సాయుధ శిక్షణతోపాటు తీవ్రవాదంవైపు మళ్లిస్తుందని గుర్తించారు. ఆ రహస్య సంస్థలో మరెందరో సభ్యులుగా ఉన్నారని పట్టుబడినవాళ్లు వెల్లడించారు. జాక్సన్ హత్యతో అప్రమత్తమైన బొంబాయి హోం శాఖ వెంటనే సమాచారాన్ని బ్రిటిష్ ఇండియా హోం శాఖకు చేరవేసింది. రెండు ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాలని నిజాం ప్రభుత్వానికి సూచిస్తూ లేఖలు రాయడమే కాకుండా నిర్ధిష్ట్టమైన చర్యలు తీసుకునేందుకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. కాల్పులు జరిపిన అనంత లక్ష్మణ కన్హెరె, అతనికి సహకరించిన కృష్ణాజీ కర్వే, వినాయక్ దేశ్పాండేలకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. 19 ఏప్రిల్ 1910న ఆ ముగ్గురినీ ఉరి తీశారు.
ఇందూరులో కన్హెరె ఓనమాలు
అనంత లక్ష్మణ్ కన్హెరె పుట్టింది బొంబాయి ఫ్రావిన్స్, రత్నగిరి జిల్లాలలోని అయాని గ్రామం. ఇందూరు (నిజామాబాద్)లో ప్రాథమిక విద్య చదివాడు. ఆ తర్వాత ఆంగ్ల విద్య కోసం ఔరంగాబాద్కు వెళ్లాడు. అక్కడ గంగారామ్ రూప్చంద్ మార్వాడీ పరిచయమయ్యాడు. గంగారామ్కి దత్తాత్రేయ పాండురంగ జోషి సహాధ్యాయి. గంగారామ్ ద్వారా జోషి పరిచయమయ్యాడు. ఆయన ప్రభావంతో సీక్రెట్ సొసైటీలో చేరాడు.