BJP | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో ఒకటికి నలుగురు ఇన్చార్జిలు ఉండటంతో ఏ సమస్య మీద ఎవరిని కలవాలో తెలియని అయోమయ పరిస్థితిని ఆ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా ఇప్పటికే ముగ్గురు ఇన్చార్జిలను ఢిల్లీ పెద్దలు నియమించారు. లోక్సభ ఎన్నికల కోసం మరో ఇన్చార్జిని నియమించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దీనికి తోడు బీఎల్ సంతోష్ ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతున్నది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా తరుణ్చుగ్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. ఆయనకు అదనంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్బన్సల్ను మరో ఇన్చార్జిగా 2022 ఆగస్టులో నియమించారు. తరుణ్చుగ్కు రాజకీయ వ్యవహారాలు, సునీల్బన్సల్కు సంస్థాగత వ్యవహారాలు అప్పగించారు.
కానీ సునీల్బన్సల్ ఎ క్కువగా రాజకీయ అంశాలపైనే ఫోకస్ పెడుతున్నారు. ఫలితంగా ఆరెస్సెస్, అనుబంధ సంఘా ల నేతలు తమ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను నియమించారు. ఆయన కూడా సంస్థాగత వ్యవహారాలు చూసుకుంటారని పేర్కొన్నారు. అలాంటప్పుడు సునీల్బన్సల్తో పనేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. సునీల్బన్సల్కు యు వమోర్చా బాధ్యతలు అప్పగించడంతో ఆయన రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్నట్టా? లేనట్టా? అని రాష్ట్ర నేతలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఇన్చార్జిగా ప్రకాశ్జవదేకర్ను గత ఏడాది జూలైలో నియమించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఆయన పదవీకాలం ముగిసినట్టే అని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ స్పష్టత లేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ అధిష్ఠానం తెలంగాణకు ప్రత్యేకంగా ఇన్చార్జిని నియమిస్తుందని పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండగా ఇంతమంది ఇన్చార్జిలను ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడం లేదని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీఎల్పీ నేత ఎంపికపై మల్లగుల్లాలు
బీజేపీ శాసనసభాపక్ష (బీజేపీఎల్పీ) నేతగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఆ పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ, సీనియర్లు ఎవ్వరూ విజయం సాధించలేదు. రాజాసింగ్ ఒక్కరే బీజేపీ తరపున మూడోసారి ఎన్నికయ్యారు. దీంతో తనకే ఎల్పీ లీడర్గా అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ పట్టుబడుతున్నారు. రాజాసింగ్ వ్యవహార శైలిపై రాష్ట్ర నాయకత్వంతోపాటు ఢిల్లీ అధిష్ఠానానికి సానుకూల అభిప్రాయం లేదు. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోవడం రాజాసింగ్కు మైనస్గా మారింది.
దీంతో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే రాజాసింగ్ అలిగారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వం ఎల్పీ నేత ప్రకటనను వాయిదా వేసింది. తాజాగా ఈ రేసులో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేరు వినిపిస్తున్నది. సోషల్మీడియాలో ఆయనకు ఫాలోయింగ్ ఉండటంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేగా మొదటిసారే గెలిచినప్పటికీ, గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉండటం, వాక్చాతుర్యం వంటి అంశాలు రమణారెడ్డికి అనుకూలంగా మారాయి. చివరకు అధిష్ఠానం ఎవరిని ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.