హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్టు ప్రయోగించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పీడీ యాక్టు ఉత్తర్వులు జారీకాగానే ఆయనను అరెస్ట్ చేశామని, గాంధీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి చర్లపల్లి జైలుకు తరలించామని వెల్లడించారు. పూర్తి వివరాలను సీపీ ఒక ప్రకటనలో వివరించారు. మంగళ్హాట్ పోలీస్స్టేషన్లో రాజాసింగ్పై రౌడీషీట్ నమోదైందని, ఆయనపై 2004 నుంచి మొత్తం 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 18 మతపరమైన కేసులున్నాయని వెల్లడించారు.
ఈ నెల 22న మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా, ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వీడియోను రాజాసింగ్ రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, ప్రశాంతతకు భంగం కలిగించేలా ఉండటంతో 23న అదుపులోకి తీసుకొన్నామని ఆనంద్ వివరించారు. మరోసారి రెచ్చగొట్టే వీడియోలు విడుదల చేస్తానని ఆ సమయంలో ఆయన మీడియాతో బహిరంగంగా ప్రకటించారని తెలిపారు. ఆ వ్యాఖ్యలు దాడులు, హింస, ఉగ్రవాదం తదతర నేరాలకు దారి తీస్తాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఉంటుందని సీపీ పేర్కొన్నారు. రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజంలో అశాంతిని సృష్టిస్తునాన్నారని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో అశాంతికి ఆజ్యం పోస్తున్నాయని, ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ నుంచి రాజాసింగ్పై పీడీ యాక్టు ప్రయోగించామని పేర్కొన్నారు. మీర్పేట్ పీఎస్లో రాజాసింగ్పై గురువారం మరో కేసు నమోదైంది.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే రాజాసింగ్ను రిమాండ్కు తరలించేందుకు కింది కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సెక్షన్ 41ఏ నోటీసును రాజాసింగ్కు ఇవ్వలేదని, రిమాండ్కు ఉత్తర్వులు ఇవ్వలేమని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొన్నది. దీంతో మంగళహాట్ ఎస్హెచ్వో హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజాసింగ్ అరెస్ట్కు కారణాలు వివరిస్తూ రిమాండ్ రిపోర్టులో పేరొన్న వాటిని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు. రాజాసింగ్పై 2006లో రౌడీషీట్ కూడా ఓపెన్ అయ్యిందని తెలిపారు. ఈ అప్పీల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనున్నది.