హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్గూడ జైలు నుంచి విడుదలైన నందకుమార్, రామచంద్ర భారతిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిని మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామచంద్ర భారతిని, చీటింగ్ కేసులో నందకుమార్ను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరికి షౌకత్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కేసులో తిరుపతికి చెందిన మఠాధిపతి సింహాయాజి, హైదరాబాద్కు చెందిన నందకుమార్, మరో వ్యక్తి రామచంద్రభారతిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 26న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో వీరిని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచి, అనంతరం చంచల్గూడ జైలుకు తరలించిన విషయం విదితమే. ఫామ్ హౌస్ కేసులో ఇటీవలే బెయిల్ వచ్చింది. దీంతో జైలు అధికారులు వారిని ఇవాళ విడుదల చేయగా, నకిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామచంద్ర భారతిని, చీటింగ్ కేసులో నందకుమార్ను మళ్లీ అరెస్టు చేశారు.