హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కమ్యూనిస్టులు, వామపక్ష పునరేకీకరణ, విశాలమైన ప్రజాతంత్ర ఐక్యతను సాధించడం ద్వారా ఫాసిజాన్ని ఓడించవచ్చని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఎం కలయిక దోహదపడుతుందని చెప్పారు. సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏటా ప్రజాసమస్యలపై కొత్త పోరాటాల రూపకల్పనకు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాడాల్సిన చారిత్రక బాధ్యత ఉన్నదన్నారు.
సీపీఐ 98వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జెండాను సురవరం సుధాకర్రెడ్డి ్డఆవిష్కరించారు. అనంతరం ‘కమ్యూనిస్టు పార్టీ ప్రాధాన్యం అవసరం’ అనే అంశంపై సురవరం, ‘రాజ్యాంగ రక్షణ ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ’ అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ప్రసంగించారు. సురవరం మాట్లాడుతూ.. దేశంలో ఫాసిస్ట్, మతోన్మాద పాలన కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. డబ్బు రాజకీయాల వల్ల ఎన్నికల్లో వామపక్షాలు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ పార్లమెంట్లో కమ్యూనిస్టులు ఉంటే ప్రజావాణిని శక్తివంతంగా వినిపిస్తామని తెలిపారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగంపై జరుగుతున్న బహుముఖ దాడిని ఎదురోకపోతే భవిష్యత్తులో ఉపన్యాసాలు ఇచ్చినా రాజద్రోహం కేసు నమోదు చేసే పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. యూనియన్ ప్రభుత్వం రాష్ర్టాలకు 41 శాతం నిధులను ఇస్తున్నామనడం అబద్ధమని, కేవలం 29 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని స్పష్టంచేశారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు అధికారాలే కాదు, కనీసం బాధ్యతలు కూడా లేవని, కేవలం మంత్రి మండలి సలహాల మేరకే నడుచుకోవాలని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదని, త్యాగం అనే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజా గొంతుకగా, నూతన తరహా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని, ఏ మూలకు వెళ్లినా ఎర్ర జెండాలు కనిపించాలని సూచించారు.
పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేశ్, ఈటీ నర్సింహా, మాజీ ఎంఎల్సీ చంద్రశేఖర్, పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్ హాజరయ్యారు.