హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని బీఆర్ఎస్ స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో చేసిన నిరసన దీక్షకు వారు మద్దతు ప్రకటించారు. రిజర్వేషన్ల అమలుపై బీఆర్ఎస్ మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు లేఖను పంపించారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన మహిళా రిజర్వేషన్ల దీక్షా కార్యక్రమం నేపథ్యంలో.. వారు ఈ లేఖను మోదీకి పంపారు. ఢిల్లీలో జరుగుతున్న ఎమ్మెల్సీ కవిత దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహిళా సాధికారత పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిబద్ధతను వంద శాతం రుజువు చేసుకున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పదవుల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్లను ప్రస్తావించారు.
తెలంగాణ స్థానిక సంస్థల్లో 50 శాతం పదవులు మహిళలకే దకేలా రిజర్వేషన్లను పెంచినట్టు లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థల్లో 50 శాతం కంటే ఎక్కువగానే పదవులు దక్కాయని, కొన్ని స్థానిక సంస్థల్లో 60 శాతం వరకు పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. కేటాయించిన రిజర్వేషన్ల కంటే అధికంగా మహిళలకు పదవులు కట్టబెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. మహిళల రిజర్వేషన్లు, రాజకీయ అవకాశాల పట్ల తమ ప్రభుత్వం, పార్టీ 100 శాతం నిబద్ధతతో వ్యవహరిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 50 శాతం కంటే ఎక్కువగా మహిళా ప్రతినిధులు అధికారంలో ఉన్నారని తెలిపారు. దీంతో పాటు మారెట్ కమిటీల నియామకాల్లోనూ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు.