హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను గెలిపించి మూడోసారి కేసీఆర్ను సీఎంను చేయాలని ప్రజలను కోరుతున్నామని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దారుసలాంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎం అభ్యర్థులు పోటీచేసే చోట ప్రజలు తమకు మద్దతివ్వాలని, తాము పోటీ చేయని సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తామని ఇంతకుముందే చెప్పామని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నదని అన్నారు. ‘ఇందులో ప్రధానంగా పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. రెండోది తెల్ల రేషన్కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని చెప్పా రు. ఇది పేదలకు మేలు చేస్తుంది. మూడోది ఆసరా పింఛన్ను రూ.5 వేలకు చేరుతుంది. ఇది పింఛన్దారులకు లబ్ధి చేకూరుస్తుంది. మరో పథకం పేద మహిళలకు రూ.3 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీలకు ఉన్న 200 ఇంటర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా మారుస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు భవనాలు కట్టిస్తామని చెప్పారు. ఇవన్నీ తెలంగాణలో అన్ని వర్గా లవారికి లబ్ధి చేకూరుస్తాయి. ఈ పథకాలను అమలుచేసే సత్తా కేసీఆర్కు ఉన్నది. తొమ్మిదేండ్లుగా ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇవే ఆయనను మూడోసారి సీఎంగా గెలిపిస్తాయి’ అన్నారు.
కేసీఆర్ స్కీంలు మోదీ కాపీ
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలను మోదీ ప్రభుత్వం కాపీ కొట్టి పేర్లు మార్చి అమలు చేస్తున్నదని ఒవై సీ అన్నారు. అమేథీలో కాంగ్రెస్ నేత లు 40 ఏండ్లలో చేసింది శూన్యమని, తెలంగాణలో కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారని అన్నారు. కాళేశ్వరం నీళ్లు, బ్లూ కలర్లో ఉన్న నీళ్ల ట్యాంకు లు కాంగ్రెస్ నాయకులు చూడవచ్చని చెప్పారు. ‘ఎంఐఎంను ఒకసారి బీఆర్ఎస్కు బీ టీమ్ అంటారు. మరోసారి బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందని అంటారు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారివైపే మేం ఉంటాం’ అని అసదుద్దీన్ స్పష్టం చేశారు.