హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయకు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని లేఖలో కోరారు.
యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను కేంద్రం కేటాయించింది. అయితేతెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు నెల వారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబరులోనే కేంద్రానికి లేఖ ద్వారా విన్నవించామని మంత్రి తెలిపారు. అక్టోబర్, నవంబర్ మాసాలకు గాను 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కేటాయించిందన్నారు.
కాగా, కేటాయించిన కోటాలో కూడా ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉంది. కావున ఇతర దేశాల నుంచి వచ్చిన వెసెల్స్ నుంచి ఎరువులు కేటాయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.
గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుంచి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలన్నారు. కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్సీఎఫ్, చంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
క్రిబ్ కో కంపెనీ నుంచి రెండు అదనపు రేక్ లు యూరియా కేటాయించాలన్నారు. అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుంచి మార్చి సరఫరాలో భర్తీ చేయాలని పేర్కొన్నారు.