Harish Rao | వరంగల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పనులు వేగంగా జరగాలని ఆదేశించినట్లు చెప్పారు. వెయ్యి మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. 2100 పడకలు వచ్చేలా డిజైన్ మార్పు చేశామని, 800 పడకలు సూపర్ స్పెషల్ బెడ్స్ ఉన్నాయన్నారు. 14 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం పూర్తయ్యిందని, దాదాపు 60శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 36 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం లేదని, నిమ్స్లో, ఇతర కార్పోరేట్ హాస్పిటల్ ఎలాంటి అత్యాధునిక సేవలు ఉన్నాయో.. అవన్నీ వరంగల్ సూపర్ స్పెషాలిటీలో అందనున్నాయన్నారు.
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హాస్పిటల్ చుట్టూ ఆరు లైన్ రోడ్ నిర్మాణం చేపడుతూనే.. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అంబులెన్స్లు, ట్రామాకేర్లోకి సులువుగా వెళ్లేలా ప్రత్యేకంగా డెడికేటెడ్ రహదారి, ఎంట్రెన్స్లు ఉంటాయని తెలిపారు. కిడ్నీ, లివర్ తదితర మార్పిడి చికిత్సలు జరిగిన సమయంలో రోగి బంధువులు ఉండేందుకు వీలుగా హాస్పిటల్ ఆవరణలో 250 మంది ఉండేలా అన్ని సౌకర్యాలతో ధర్మశాల నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. 400 మంది రెసిడెంట్ డాక్టర్లకు స్పెషల్ రూమ్స్, 450 మందితో సమావేశం ఏర్పాటు చేసేలా కాన్ఫరెన్స్ హాలు ఏర్పాటు చేస్తున్నామని, యూనివర్సిటీతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్లో ఉండడం గర్వకారణమన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో వరంగల్లో ఒకే ఒక్క కేఎంసీ ఉండేదని, ఇప్పుడు ఏడు మెడికల్ కాలేజీలు విద్యా సంవత్సరం అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
ఇంకా ఒకటి ములుగులో వచ్చే విద్యాసంవత్సరం ఇవ్వబోతున్నామన్నారు. వరంగల్పై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని, ఒకప్పుడు నియోజకవర్గం గా ఉన్న ములుగులో సైతం ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డు అన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో పేద విద్యార్థులకు వైద్య విద్యoతో పాటు, ఒక్కో కాలేజ్తో 2వేల మందికి ఉపాధి దొరకనుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, రిమోట్ ఏరియాలోని ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 2958 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటే.. ఇప్పుడు 8,340 అడ్మిషన్లు చేయబోతున్నామన్నారు.
వైద్యవిద్య కోసం రష్యా, చైనాకో పోవాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీ శాతం 70 వరకు నమోదవుతుందన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు చాలా కష్టపడుతున్నారని, ఇదే స్ఫూర్తితో 70శాతం మరింత ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు. మన రాష్ట్రంలోనే 100శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు జరుగుతున్నాయని కేంద్రం అభినందించిందన్నారు. సమావేశంలో ఎంపీ దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఉన్నారు.