హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా రెండేండ్లపాటు నిలిచిపోయిన సమ్మర్, స్పోర్ట్స్ క్యాంపులను పునఃప్రారంభించనున్నట్టు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలోని 45 చోట్ల సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో ఇంటర్ ప్రతిభా కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ప్రతి సమ్మర్ క్యాంప్ కేంద్రంలో 100 మంది చొప్పున ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులకు సంగీతం, నాట్యం, పెయింటింగ్, రేఖాచిత్రం, చిత్రలేఖనం, భాషా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, బొమ్మల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని వివరించారు. స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లను ఈ నెల 26 నుంచి 15 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. మహబూబాబాద్ చెస్ అకాడమీ నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 30 వరకు కోట్ల విజయభాసర్రెడ్డి స్టేడియంలో జరిగే చదరంగం పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్రంలో గురుకుల విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఫలితంగా గురుకులాల్లో చదివే విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారని పేర్కొన్నారు.