హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వేసవి ఇంకా చురుక్కుమనిపించకముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. నిరుటితో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గత డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 859 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 6 శాతం అధికంగా 914 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ నిరుడు ఇదే సమయంతో పోల్చితే భూగర్భ జలాలు ఒకటిన్నర మీటర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. రాష్ట్రంలో గత నెల సగటు భూగర్భ జలమట్టం 6.8 మీటర్లు ఉండగా, ప్రస్తుతం అది 7.72 మీటర్లుగా నమోదైంది. నాలుగు జిల్లాల్లో సగటు భూగర్భ జలమట్టం 0.32 నుంచి 5 మీటర్లలోపు ఉండగా, 25 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్లు, మిగిలిన 4 జిల్లాలో 10 మీటర్లకు మించిన లోతులో భూగర్భ జలాలు ఉన్నట్టు భూగర్భజలశాఖ నివేదిక తెలిపింది. ప్రాజెక్టుల నుంచి ఆశించిన స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం, గతంలో మాదిరిగా చెరువులను క్రమం తప్పక నింపకపోవడమే అందుకు కారణమని అర్థమవుతున్నది. గత ప్రభుత్వం క్రమం తప్పకుండా చెరువులు, చెక్డ్యాములను నింపడం వల్ల మండువేసవిలోనూ భూగర్భ జలమట్టం పడిపోకుండా స్థిరంగా ఉన్నది. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి ఉండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఈసారి ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడంతో ఈ బేసిన్ పరిధిలో భూగర్భ జలాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. శ్రీశైలం, సాగర్తోపాటు పలు ప్రాజెక్టులు ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరవలో ఉన్నాయి. ప్రాజెక్టులు నిండకపోవడంతో పంటలు వేసుకోవద్దని అధికారులు రైతులకు సూచించారు. కాలువల ద్వారా నీటి విడుదల ఆగిపోవడంతో బేసిన్ పరిధిలోని రైతులు బోరుబావులపై ఆధారపడి యాసంగి పంటను సాగుచేశారు. భూగర్భ జలమట్టం మరింత కిందికిపడిపోవడానికి ఇది కారణమైంది. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 3.57మీటర్లకు భూగర్భ జలాలు పడిపోగా, నల్లగొండలో 3.41మీటర్లు, వికారాబాద్లో 3.26 మీటర్లు, మహబూబ్నగర్లో 3.12 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 2.93 మీటర్లు, నారాయణపేటలో 2.72మీటర్లు, సూర్యాపేటలో 2.74 మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.38మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది.
సమృద్ధిగా వర్షాలు కురిసినా, ఆశించిన స్థాయిలో వరద వచ్చినా గోదావరి బేసిన్లోనూ ఈ ఏడాది భూగర్భజలాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించి అవసరం మేరకు ఎప్పటికప్పుడు జలాలను ఎత్తిపోసి, తద్వారా ఆయా ప్రాజెక్టులకు కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపారు. మేడిగడ్డ డ్యామేజీ పేరిట ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది చెరువులు, చెక్డ్యాంలు నింపడం లేదు. ఫలితంగా గోదావరి బేసిన్లోనూ భూగర్భజలాలు త్వరితగతిన అడుగంటుతున్నాయి.