బేగంపేట్, డిసెంబర్ 23: మధుమేహ సమస్య లేకుండానే ఆ లక్షణాలతో బాధపడుతున్నదో మహిళ. మూర్ఛ, కండ్లు తిరిగి పడిపోవటం వంటి సమస్యలతో సతమతమవుతున్నది. ఏమిటా? అని దవాఖానకు వెళ్తే.. క్లోమంలో కణితి ఉన్నట్టు గుర్తించారు. దానివల్లే షుగర్ సమస్య వచ్చిందని తేల్చారు. పది లక్షల మందిలో ఒకరికి వచ్చే ఆ కణితిని కిమ్స్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ గౌతమ్ పాండురంగ శుక్రవారం దవాఖానలో మీడియాకు వెల్లడించారు.
ఓ గృహిణి(36) పదేండ్లుగా మూర్ఛతో ఇబ్బంది పడుతున్నది. తరచూ కండ్లు తిరిగి పడిపోతున్నది. దీంతో ఆమె కిమ్స్లో చేరింది. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్దాస్, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ స్మిత నల్లాలు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇన్సులినోమా సమస్య ఉన్నదని తేల్చారు. క్లోమంలో కణితి వల్ల ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మధుమేహం వస్తున్నదని గుర్తించారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి నేతృత్వంలో డిస్టల్ పాంక్రియాటెక్టమీ శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు.