హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యుడు డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ ఏర్పాటైనప్పటి నుంచి చైర్మన్గా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. మొదటిసారిగా సుధాకర్రావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈయన రెండేండ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. సుధాకర్రావు స్వస్థలం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వడ్డేకొత్తపల్లి. హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ వైద్యుడు (ఎండోక్రైనాలజిస్ట్). 1974లో ఎంబీబీఎస్, 1984లో డీఎం పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగం హెడ్గా పనిచేస్తూ 1999లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వివిధ హోదాల్లో కొనసాగారు. ఈ క్రమంలో ఆయన వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు 8 పరిశోధన పత్రాలను ప్రచురించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2014లో ఎండోక్రైనాలజీ విభాగంలో, 2016లో డయాబెటిక్ విభాగంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వరించాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ వైద్యుల సొసైటీల్లో సభ్యుడిగా ఉన్నారు.
బలమైన రాజకీయ కుటుంబం
సుధాకర్రావు కుటుంబానికి బలమైన రా జకీయ నేపథ్యం ఉన్నది. ఆయన తండ్రి య తిరాజారావు ఉమ్మడి ఏపీలో ఏడుసార్లు ఎ మ్మెల్యేగా పనిచేశారు. ప్రొటెం స్పీకర్గా చేశారు. సుధాకర్రావు 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు సుధాకర్రావు 1969 ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతో అరెస్టు కూడా అయ్యారు. 2010లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరి క్రియాశీల రాజకీయ నేతగా కొనసాగారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. అంచనాల కమిటీ సభ్యుడిగా, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్గా వ్యవహరించారు.