నమస్తేతెలంగాణ న్యూస్నెట్వర్క్, డిసెంబర్ 8: అసలే శీతాకాలం.. దానికి మిగ్జాం తుఫాను తోడై తెలంగాణ పల్లెలపై దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. నాలుగురోజులుగా చీకటిపోయి పగలు వచ్చినా మంచు మబ్బులు తొలగడంలేదు. చీకటి తెరలను చీల్చుతూ.. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే సూర్యకిరణాలు రాకపోవడంతో.. చలిపులి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడం తో చలి తీవ్రత పెరిగింది. జీవరాశులన్నీ వణుకుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంట లు దాటినా రోడ్లపై మంచు తగ్గకపోవడంతో హైదరాబాద్ నగరంతోపాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జాతీయరహదారులపై వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని వెళ్లడం కనిపించింది. రోజంతా పొగమంచు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. మొన్నటి వరకు ఎండాకాలమా? శీతాకాలామా? అని తెలియని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పగటి ఉష్ణోగ్రతలు 14-13 డిగ్రీలకు పడిపోతున్నాయి. చలి తీవ్రతను తట్టుకోలేక వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.