సుబేదారి, జూలై 22: ప్రణాళిక, పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని దాస్యం రంగశీల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ముఖ్యఅతిథులుగా బుర్రా వెంకటేశం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడు తూ.. పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ యువతకు దాస్యం వినయ్భాస్కర్ మూడు నెలలుగా ఉచితంగా కోచింగ్ ఇప్పించడంతోపాటు స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయమన్నారు. దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దాస్యం రంగశీల ఫౌండేషన్ తరఫున మూడునెలలపాటు ఉచిత కోచింగ్తోపాటు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పోటీపరీక్షల స్టడీ మెటీరియల్ అందజేశామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్, జాగృతి ఉపాధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్, కేయూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పుల్లా శ్రీనివాస్, విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ రాజిరెడ్డి, అన్వర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.