పెద్దపల్లి, జూలై 12(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, బీజేపీ ప్రజాప్రతినిధుల అజమాయిషీతో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)కు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్లాంట్లోకి నీరు చేరి ఉత్పత్తికి విఘాతంగా మారింది. వర్షం మినహా గాలులు లేని ఈ సమయంలో ఎలికాన్ కంపెనీ నిర్మించిన ప్యాకింగ్ యూనిట్ పైకప్పు మంగళవారం ఎగిరిపోవడం ఆర్ఎఫ్సీఎల్ నాణ్యతను ప్రశ్నిస్తున్నది.
చిన్నపాటి గాలులకే అమ్మోనియా, ఆర్సీ, బ్యాగింగ్ యూనిట్ల పైకప్పు కూలిపోవడంతో కన్వేయర్ ప్రాంతంలో భారీ వరదలు వచ్చాయి. దీంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 50 వేల యూరియా బస్తాలు తడిచిపోయాయి. రామగుండంలో గాలిని, నీరును విషతుల్యం చేస్తూ ప్రజల జీవితాలను, ఆరోగ్యాలను లెక్క చేయకుండా వ్యర్థ రసాయనాలను గోదావరి నదిలోకి వదులుతున్నదని ఇప్పటికే ఆర్ఎఫ్సీఎల్పై కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు ప్యాకింగ్ యూనిట్ పైకప్పు లేచిపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.