మారేడ్పల్లి, జూన్ 25: అగ్నిపథ్ అమలైతే డిఫెన్స్ అకాడమీలు మూతపడుతాయనే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు కుట్ర చేశారని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ డాక్టర్ బీ అనురాధ తెలిపారు. సుబ్బారావుతో పాటు మరో ముగ్గురు అనుచరులను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్ గా పని చేసి 2011లో బయటకు వచ్చాడు.
2014లో నరసరావుపేటలో సాయి డిఫెన్స్ ఆకాడమీని ఏర్పాటు చేసి ఆర్మీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాడు. మెడికల్, ఫిజికల్ పూర్తిచేసిన ఆర్మీ అభ్యర్థులను ఎంపిక చేసుకొని వారి వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లు, రూ.3 లక్షల బాండ్ రాయించుకొని ఫ్రీ కోచింగ్ను ఇస్తున్నాడు. ఉద్యోగం వచ్చాక ఆర్మీ అభ్యర్థులు ఆ డబ్బులను చెల్లించి సర్టిఫికెట్లను తీసుకెళ్తారు. అయితే, అగ్నిపథ్ అమల్లోకి వస్తే డిఫెన్స్ అకాడమీలన్నీ మూతపడుతాయని, దాంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని భావించి విధ్వంసానికి ఆవుల సుబ్బారావు కుట్ర చేశాడు’ అని తెలిపారు.
పలు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టాడని, అగ్నిపథ్కు వ్యతిరేకంగా హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్లో రైళ్లు, రైల్వే స్టేషన్లపై చేస్తున్న దాడులను వివరిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ ఇలాంటి విధ్వంసాలు చేయాలని వాయిస్ మెసేజ్లు పంపాడని వివరించారు. ఆర్మీ అభ్యర్థులను మరింత రెచ్చగొట్టే బాధ్యత తన అనుచరులు మల్లారెడ్డి, శివకుమార్, బీసీ రెడ్డికి అప్పగించారని వెల్లడించారు. ఈ నెల 16న హైదరాబాద్కు వచ్చి ఓ లాడ్జిలో దిగాడని, సికింద్రాబాద్ అల్లర్లలో ఒక యువకుడు మృతి చెందాడని తెలుసుకొని ఇక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. నిందితులకు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని, వారిపై రైల్వే యాక్టుతో పాటు పలు కేసులు నమోదు చేశామని ఆమె పేర్కొన్నారు