అల్వాల్, డిసెంబర్ 12: విదేశాల్లో చదువుకోవడం కష్టమేమీ కాదనీ.. కానీ అందుకు సరైన గైడెన్స్ అవసరమని వై యాక్సిస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ తెలిపారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్లోని లయోలా అకాడమీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, పీజీ విద్యార్థులకు ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో వై యాక్సిస్ కన్సల్టెన్సీ సహకారంతో విదేశీ విద్యపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఫైజల్ హుస్సేన్ మాట్లాడుతూ , చాలామంది విద్యార్థులకు విదేశాల్లో చదువాలనే కోరిక ఉన్నా సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక ఆగిపోతున్నారని తెలిపారు. అలాంటి విద్యార్థులకు మంచి మార్గదర్శనం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గైడెన్స్తోపాటు ఆంగ్ల పరిజ్ఞానం ఉంటే అమెరికా, కెనడా, యూకే తదితర దేశాలకు 7 నుంచి 14 నెలల సమయంలో వెళ్లిపోవచ్చని చెప్పారు. అనంతరం పలువురు విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో లయోలా అకాడమీ ప్రిన్సిపాల్, గ్జేవియర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్ జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అరుల్ జోతి, అకాడమీ డీన్ డాక్టర్ సుచిత్ర నాయుడు, మీడియా కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ వీజే భారతి, ప్రొఫెసర్ బీ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం
ఈ సదస్సు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుంది. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఉన్నత విద్య కోసం చాలామంది విదేశాలకు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి సదస్సు ద్వారా వారిలో ఉన్న సందేహాలు తప్పకుండా తీరుతాయి.
– డాక్టర్ ఎల్ జోజిరెడ్డి,ప్రిన్సిపాల్, లయోలా అకాడమీ
విలువైన సమాచారం అందించారు
వై యాక్సిస్ కన్సల్టెన్సీ ఇలాంటి సదస్సు నిర్వహించడం అభినందనీయం. మా విద్యార్థులకు ఎంతో విలువైన సమాచారం అందజేశారు.
– అరుల్ జోతి, వైస్ ప్రిన్సిపాల్, లయోలా అకాడమీ