హైదరాబాద్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ అధ్యయనం కొనసాగుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్ ఓబీసీ కమిషన్తో చర్చించగా, రెండోరోజు గురువారం మరోసారి భేటీ అయ్యింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు నేతృత్వంలో సభ్యులు మధ్యప్రదేశ్ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో భోపాల్లోని సచివాలయంలో భేటీ అయ్యారు. మన్మోహన్ నాగర్, సురేశ్ మహాజన్ కేసులతో న్యాయపరంగా మధ్యప్రదేశ్ ఎదురొన్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై సమాలోచనలు జరిపారు. సంఖ్యాపరమైన సమాచార సేకరణలో అవలంబించిన ప్రామాణిక పద్ధతులను తెలుసుకున్నారు.
ట్రిపుల్ టెస్ట్లను సంతృప్తి పరుస్తూ సమర్పించిన నివేదికలోని కొలమానాలు, సుప్రీంకోర్టు అభ్యంతరాలు, నివారణోపాయాలపై రాష్ట్ర బీసీ కమిషన్ చర్చించిం ది. సమావేశంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే కిశోర్గౌడ్తోపాటు మధ్యప్రదేశ్ ఓబీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ గౌరీశంకర్ బిసేన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ బర్నవాల్, కమిషనర్ గోపాల్చంద్ర దాద్, సభ్య కార్యదర్శి లతా శరణాగత్, పలువులు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ బృందం పర్యటన మరో రెండు రోజుల పాటు కొనసాగుతుంది.