హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో విద్య అభ్యసించాలని ఆశపడుతున్న విద్యార్థుల్లో అత్యధికులు యూకే వైపు చూస్తున్నారు. ఇంతకాలం అమెరికా, ఆస్ట్రేలియాలను ఎంచుకోగా, ఈ ఏడాది విద్యార్థులు వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. విదేశాల్లో విద్యకోసం వెళ్లేవాళ్లలో దాదాపు 75 శాతం విద్యార్థులు యూకేను ఎంచుకుంటున్నట్టు లివరేజీ ఎడ్యు సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్నవారిలో 94 శాతం విద్యార్థులు ఈ ఏడాది విదేశీ చదువులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని అభిప్రాయపడగా, అత్యధికులు మేనేజ్మెంట్, ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తేలింది. కరోనా నేపథ్యంలో ఇటీవలే యూకే, అమెరికాలు ఇమ్మిగ్రేషన్ను ప్రారంభించి వీసా స్లాట్లను కేటాయిస్తున్నాయని, దీంతో ఫారిన్ ఎడ్యుకేషన్ను ఎంచుకొనే విద్యార్థుల సంఖ్య రెట్టింపయినట్టు లివరేజీ ఎడ్యు వ్యవస్థాపకుడు అక్షయ్చదుర్వేది అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ఒక్క యూకేలో మాత్రమే ముఖాముఖి తరగతులను ప్రారంభించారని, విద్యార్థులకు అక్కడి ప్రభుత్వమే వ్యాక్సిన్లు వేయిస్తున్నదని, దీని ఫలితంగా అత్యధికులు యూకేవైపు చూస్తున్నట్టు ఆయన వివరించారు.