హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) సారథులుగా మన రాష్ర్టానికి చెందిన ఆరు కాలేజీల విద్యార్థులు ఎంపికయ్యారు. జాతీయంగా 262 విద్యాసంస్థల నుంచి 721 మంది స్టూడెంట్ అంబాసిడర్లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నియమించింది. మన రాష్ట్రం నుంచి సేయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీ, ఇప్లూ, సేయింట్ జోసెఫ్ కాలేజీ, సేయింట్ పాయిస్ డిగ్రీ, పీజీ కాలేజీ, ప్రభుత్వ నిజామియా టీబీ కాలేజీ, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఒక్కో కాలేజీ నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులను అంబాసిడర్లుగా అవకాశం కల్పించారు. ఎన్ఈపీ ద్వారా చేపట్టే సంస్కరణలను వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు.