ముదిగొండ, మార్చి 15 : అనుమానాస్పద స్థితిలో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మంజిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంఅర్బన్ మండలం ధంసలాపురానికి చెందిన చింతకాయల శ్వేత (17) ముదిగొండ మండలం వల్లభి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది.
ఈ నెల 9న ఆరోగ్యం బాగాలేదని హాస్టల్ నుంచి ఫోన్ రాగా అదేరోజు శ్వేతను తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవటంతో ఈ నెల 12, 14న ఖమ్మంలోని దవాఖానల్లో వైద్యం చేయించారు.
అయినా ఆరోగ్యం కుదటపడకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు శ్వేతను ఆరా తీయగా.. ఆయా మందలించడంతో ఈ నెల 7న హాస్టల్లో ఐరన్, పారాసిటమాల్ మాత్రలు వేసుకున్నానని చెప్పింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి శ్వేత మృతిచెందింది. ఆయా మందలించడమే తమ కుమార్తె మృతికి కారణమని శ్వేత తల్లి ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళి తెలిపారు.