నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 25: ప్రజల న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ అగ్రభాగాన ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని సామాజిక మార్పు కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యే యంగా న్యాయవ్యవస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, రోటరీ క్లబ్ సం యుక్తంగా నిజామాబాద్ కలెక్టరేట్ భవనంలో ఆదివారం న్యాయసేవలు, మోడల్ క్యాంప్, ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఉచిత న్యాయసేవలు పౌ రుల ప్రాథమిక హక్కు అని, ఈ సేవలను ఎల్లవేళలా అందిస్తామని చెప్పారు. జిల్లాలను విభజించి రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా జిల్లాల న్యాయస్థానాలను ఏర్పాటు చేయడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, విచారణలో ఉన్న కేసులు, కొత్త కేసులు న్యాయవ్యవస్థకు భారంగా మారాయని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ నవీన్రావు చెప్పారు. ఈ సందర్భంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సునీత కుంచాల తదితరులు పాల్గొన్నారు.