హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పోస్టల్ విభాగాన్ని ప్రైవేటీకరించాలన్న నరేంద్రమోదీ సర్కార్ ఆలోచనను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు భోజన విరామ సమయంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కన్వీనర్ ఏ శ్రవణ్కుమార్ ప్రకటించారు. మంగళవారం చార్మినార్, ఖైరతాబాద్, ఉప్పల్లోని ప్రధాన పోస్టల్ కార్యాలయాలతోపాటు తెలంగాణ సర్కిల్లో.. 17న సికింద్రాబాద్, అబిడ్స్లోని డాక్ సదన్, వికారాబాద్లో.. 18న హైదరాబాద్ జీపీవో, తిరుమలగిరి హెడ్ పోస్టాఫీస్ వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. కమలేశ్ శర్మ కమిటీ సిఫారసులను అమలు చేయాలని శ్రవణ్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.