హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ అగ్నిమాపక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. గతంలో వారానికోసారి మాత్రమే ఫైర్ మాక్డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు చేపట్టిన అగ్నిమాపక విభాగం.. ఇప్పుడు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు రోజూ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, మాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నది. అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కమర్షియల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, థియేటర్స్, మల్టీప్లెక్స్లు, పరిశ్రమలు, నివాసాలు, వసతి గృహా ల యజమానులు, నిర్వాహకులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. దీనిలో భాగంగా గత వారం రోజుల్లో 465 చోట్ల మాక్డ్రిల్స్ నిర్వహించింది.
22 రోజుల్లో 1,400 చోట్ల తనిఖీలు
గత నెల 20 నుంచి ఈ నెల 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,400 చోట్ల తనిఖీలు నిర్వహించిన అగ్నిమాపక అధికారులు.. కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాళ్లు, థియేటర్లు, పరిశ్రమలు, దవాఖానల్లోని ఫైర్ఫైటింగ్ వ్యవస్థలపై ఆరా తీశారు. 22 రోజుల వ్యవధిలోనే 2 వేలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు నాగిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.