హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: ప్రజల మధ్య విధులు నిర్వహించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. దుండగుల చేతిలో దాడికి గురైన ఆర్టీసీ సిబ్బందిని హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో బుధవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితోపాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్ రమేశ్, డ్రైవర్ షేక్ అబ్దుల్కు ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దాడిలో తీవ్రగాయాలపాలైన కండక్టర్ రమేశ్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.