హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఎప్పటికప్పుడు వైద్యసదుపాయాలను విస్తరిస్తూ.. ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరుస్తూ ఉండాలి. ప్రజలపై ఆర్థికభారాన్ని తప్పించాలి. తద్వారా ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించగలగాలి. మరోవైపు మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేసి, సర్కారు దవాఖానలకు అనుసంధానించాలి.
అటు వేలాదిమంది విద్యార్థులకు ఉచిత వైద్యవిద్యను అందిస్తూ.. ఇటు ప్రజలకు విస్తృత సేవలను అందుబాటులోకి తేగలగాలి. కానీ.. ప్రజలకు ఉచితంగా వైద్యం, వైద్యవిద్య అందించే బాధ్యతనుంచి బీజేపీ పాలిత రాష్ర్టాలు క్రమంగా పక్కకు తప్పుకొంటున్నాయి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్కు తెగనమ్ముతున్న మోదీ ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తూ.. బీజేపీ పాలిత రాష్ర్టాలు ప్రజావైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తున్నాయి. ఈ సంప్రదాయాన్ని గుజరాత్ మొదలుపెట్టింది. ఆ తర్వాత యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తాజాగా మధ్యప్రదేశ్ పీపీపీ పల్లవి అందుకున్నాయి.
ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ పద్ధతి)లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఏకంగా ‘నీతి ఆయోగ్’ 2020లోనే సూచించడం గమనార్హం. దేశంలో మెరుగైన వైద్యసేవలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల అయ్యే పని కాదంటూ పేర్కొన్నది. అంతేకాదు.. నేషనల్ మెడికల్ కమిషన్ సైతం వీటి ఏర్పాటుకు సై అంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్రం సహకరించకపోయినా.. పూర్తిగా సొంత నిధులతో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నది. ఇప్పటికే 12 కాలేజీలు ఏర్పాటు చేయగా.. తాజాగా 8 కళాశాలల ఏర్పాటుకు పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంబీబీఎస్.. పేదలకు దూరం
డాక్టర్ కోటు వేసుకోవాలని లక్షలాది మంది విద్యార్థులు కలలు కంటుంటారు. వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అండగా నిలుస్తూ ఉచిత విద్యను అందిస్తున్నాయి. ప్రైవేట్లో ఎంబీబీఎస్ చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, ఫీజులు కట్టాలి. మేనేజ్మెంట్ కోటా అయితే కోర్సు పూర్తయ్యేసరికి ఏకంగా రూ.కోట్లు ఖర్చవుతుంది. అలాంటి స్థితిలో ప్రభుత్వ వైద్యకళాశాలలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఓ వరంలా మారాయి. కానీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆ కలలు కూడా కల్లలు అవుతున్నాయి. పీపీపీ పద్ధతిలో ఏర్పాటయ్యే కాలేజీల్లో ప్రభుత్వం, సంస్థ మధ్య ఒప్పందాన్ని బట్టి యాజమాన్య కోటా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ర్టాల్లో 25 శాతం వరకు ఈ కోటా ఉన్నట్టు చెప్పారు.
తెలంగాణకు వచ్చి నేర్చుకోవాలి
యూపీ సీఎం ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్.. ఇలా బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు తరుచూ తెలంగాణకు వచ్చి సీఎం కేసీఆర్పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ వెళ్తున్నారు. తెలంగాణ కన్నా తమ రాష్ర్టాలే బాగున్నాయంటూ గప్పాలు కొట్టుకుంటున్నారు. కానీ.. ఏ రంగంలోనూ ఆ రాష్ర్టాలు తెలంగాణకు సాటిరావని ప్రతి ఒక్కరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం సహకరించకపోయినా పేదలకు కార్పొరేట్స్థాయి వైద్యసేవలు అందించాలని, పేద విద్యార్థులకు ఉచితంగా ఎంబీబీఎస్ విద్య అందించాలనే గొప్ప లక్ష్యంతో పూర్తిగా సొంత నిధులతో ఈ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే 12 కాలేజీలు ఏర్పాటుచేయగా, రెండు రోజుల కిందటే కొత్తగా 8 కాలేజీలకు కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ‘డబుల్ ఇంజిన్’ సర్కార్లు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడంలో ‘ట్రబుల్ ఇంజిను’్లగా మిగిలిపోగా.. తెలంగాణలోని ‘సింగిల్ ఇంజిన్’ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అన్నిస్థాయిల ప్రభుత్వ దవాఖానల్లో అద్భుతంగా సదుపాయాలు కల్పించింది. కరోనా సంక్షోభం తర్వాత వైద్యసేవల విస్తృతికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు కలను సాకారం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది.
మొదలుపెట్టిన గుజరాత్..
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీల ఏర్పాటును ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ తొలుత మొదలు పెట్టింది. 2016లో ఆ రాష్ట్రం ప్రకటించిన హెల్త్పాలసీలో 6 పీపీపీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ వరుస కట్టాయి. ఉత్తరప్రదేశ్ 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కర్ణాటక 9 కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. మహారాష్ట్ర 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. తాజాగా మధ్యప్రదేశ్లో పీపీపీ పద్ధతిలో 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొదటి విడుదతగా ఇండోర్, భోపాల్, జబల్పూర్, కట్ని, బాలాఘాట్లో కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ చెప్పారు.
డబ్బులిస్తేనే వైద్యం..
ప్రభుత్వ దవాఖానల్లో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. కానీ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసే దవాఖానల్లో కచ్చితంగా ఫీజులు వసూలు చేస్తారు. పీపీపీ నిబంధనల ప్రకారం.. కాలేజీ భవనాలు, అనుబంధంగా కొత్తగా దవాఖాన నిర్మించాల్సి వస్తే ప్రభుత్వం భూమిని సేకరించి 99 ఏండ్లపాటు ప్రైవేటు సంస్థకు అప్పగిస్తుంది. ప్రైవేటు సంస్థ భవనాలను నిర్మిస్తే.. ప్రభుత్వం సదుపాయాలను కల్పిస్తుంది. ఒకవేళ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే జిల్లా దవాఖానను ప్రైవేట్కు అప్పగిస్తారు.