బ్రహ్మోత్సవ ఏర్పాట్ల కోసమే
ఈ నెల 19 నుంచి 25 వరకు
26 నుంచి పునఃదర్శనం
చేర్యాల, డిసెంబర్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూలవిరాట్టు దర్శనాన్ని ఈ నెల 19 నుంచి 25 వరకు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో అలూరి బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. మంగళవారం ఆలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26న మల్లన్నస్వామి కల్యాణోత్సవం (బ్రహ్మోత్సవాలు) సందర్భంగా స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు రంగుల అలంకరణ నిమిత్తం దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 26న ఉదయం 6 నుంచి స్వామి వారి మూలవిరాట్టు పునఃదర్శనం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాల దర్శనం, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.