నారాయణపేట రూరల్: తన భర్త మొదటి భార్యపై కనబరుస్తున్న ప్రేమను సహించలేని మహిళ.. అతని కొడుకును కుంటలో వేసి ఉసురుతీసింది. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా రూర ల్ మండలంలోని బండగొండలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నీలప్పకు బోకులింటి వసంతతో పదేండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి చరణ్ (5) కొడుకు ఉన్నాడు. నాలుగేండ్ల కిందట దామరగిద్ద మండలం బాపన్పల్లికి చెందిన నాగమ్మను నీలప్ప రెండో పెండ్లి చేసుకున్నా డు. ఈమెకు ఏడాది కుమార్తె ఉన్నది. మొదటి భార్య వసంతపై భర్త, అత్త చూపుతున్న ప్రేమను నాగమ్మ సహించలేకపోయింది. దీంతో వసంత కొడుకు చరణ్ను చంపేందుకు పథకం రచించింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బాలుడిని వెంట తీసుకెళ్లి గ్రామ శివారులోని అస్లోనికుంటలో తోసేసింది. కూలి పనులకు వెళ్లొచ్చిన వసంతకు చరణ్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. నాగమ్మను విచారించగా బాలుడిని తానే కుంటలో వేసి చంపినట్టు ఒప్పుకున్నది. పోలీసులు సోమవారం రాత్రి కుంటలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.