హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 27వేల స్కూళ్లను నాలుగువేలకు కుదించడం, 23వేల స్కూళ్లను మూసివేయడాన్ని నిరసిస్తూ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతమయినట్టు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేత కుట్రలను నిరసిస్తూ తలపెట్టిన ఈ బంద్ 33 జిల్లాల్లో విజయవంతమయ్యిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ విద్యను అంతంచేసేందుకు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నదని మండిపడ్డారు. ఇంకా యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందకపోవడం శోచనీయమని వాపోయారు. బ్రేక్ఫాస్ట్ అన్ని బడుల్లో ఎందుకు అమలుకావడంలేదని ప్రశ్నించారు. కొందరు పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించి కార్యకర్తలను అరెస్ట్చేశారని ఆరోపించారు.
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 నుంచి 70కి పెంచొద్దని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కి ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ నాగుల మాట్లాడుతూ..
రాష్ట్రవ్యాప్తంగా 800-850 మంది ప్రొఫెసర్లు వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీగా ఉన్నారని తెలిపారు. ఎక్కడా ప్రొఫెసర్ల కొరత లేదని వివరించారు. రాష్ట్రంలో 400 మంది అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు 1,900 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 70కి పెంచితే ఉద్యోగోన్నతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.