హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లు, హోమ్లను తనిఖీ చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హాస్టళ్లు, హోమ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. హనుమకొండలోని ఓ కాలేజీలో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతిపై యువకులు లైంగికదాడి చేసిన ఘటనపై ఆమె స్పందించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.