నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాచరికం నుంచి విముక్తి పొంది ప్రజాస్వామిక వ్యవస్థలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి. అన్ని జిల్లా, మండల కేంద్రాలు, నగరపాలక సంస్థలు, పురపాలక కేంద్రాల్లో మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. తెలంగాణ సాయుధ పోరాటయోధులు, స్వాతంత్య్ర సమరయోధులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. నల్లగొండ పోలీస్ పరేడ్గ్రౌండ్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కామారెడ్డి కలెక్టరేట్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పతాకావిష్కరణ చేశారు.
వికారాబాద్లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు పాల్గొని మహనీయులకు నివాళులర్పించారు. నిజామాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సబితారెడ్డి జెండావిష్కరణ చేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దామని పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయనపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. వనపర్తి, మహబూబ్నగర్లలో జరిగిన ఉత్సవాలకు మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్లు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు కాకపోతే రాష్ట్ర సంపద పెరిగేదా అని కరీంనగర్లో నిర్వహించిన ఉత్సవాల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. విచ్ఛిన్నకర శక్తుల కుట్రల పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవాల్లో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. జగిత్యాల, ఖమ్మం కలెక్టరేట్లలో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జాతీయ జెండాలను ఎగురేశారు. నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
విచ్ఛిన్నకర శక్తులతో జాగ్రత్త: కేకే
సఖ్యతగా, ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ జీవనాన్ని భగ్నం చేసేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. సహనశీల తెలంగాణపై కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన తెలంగాణభవన్లో జాతీయజెండాను ఎగురవేశారు. తెలంగాణతల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలు, కులాలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, అరికెల నర్సారెడ్డి, పార్టీ నేతలు పర్యాద కృష్ణమూర్తి, బండి రమేశ్, గాంధీనాయక్, రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
అమిత్ షాది దేశ విచ్ఛిన్నరకర నాదం: వినోద్కుమార్
నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యతా వాదంతో ముందుకు సాగితే, నేటి హోంమంత్రి అమిత్షా దేశ విచ్ఛిన్నకర నాదంతో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. మత విద్వేషపు బీజాలు నాటుతూ బీజేపీ దేశ సమగ్రతకు నష్టంచేస్తున్నదని మండిపడ్డారు. సంకుచిత భావంతో ఏమీ సాధించలేరన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలని సూచించారు. పటేల్ దేశంలోని దాదాపు 540 సంస్థానాలను భారత యూనియన్లో కలిపారని, అందులో భాగంగానే హైదరాబాద్ సంస్థానాన్నీ అంతర్భాగం చేశారని గుర్తుచేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ను గవర్నర్ (రాజ్ ప్రముఖ్)గా పటేల్ నియమించారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మత విశ్వాసం కలిగి ఉండటం ప్రజల ప్రాథమిక హక్కు అని.. అయితే మత ఛాందస వాదం మాత్రం దేశానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. దేశ ప్రజలు కుల, మత, రాజకీయ విద్వేషాలకు అతీతంగా సమైక్యతా భావంతో కలిసి ప్రగతి పథంలో పయనించాలని పిలుపునిచ్చారు.