హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా రూ.15,600 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీన్ని నిజం చేస్తూ రూ.14,137 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడి కంటే రూ.1,800 కోట్లు అధికమని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.14 వేల కోట్లు దాటడం ఇదే తొలిసారని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలకు సంబంధించి 19.20 లక్షలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినట్టు తెలిపారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,175 కోట్లుగా ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి గత తొమ్మిదేండ్లలో ఏకంగా 552% పెరగడం గమనార్హం. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది. 2014-15లో సుమారు 9 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. ప్రస్తుతం అవి రెట్టింపునకుపైగా పెరగడం ఇందుకు నిదర్శనం.
2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ‘రియల్’ నిపుణులు సైతం ఇదే విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సంస్కరణల పథం కొనసాగుతుండటం, ఫాక్స్కాన్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది స్థిరాస్తి లావాదేవీలు మరింత భారీగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మాడల్ను సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పరిచయం చేస్తుండటం కూడా రాష్ర్టానికి ఎంతో కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని తెలుసుకొని ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు మరింత మంది ఆసక్తిచూపే అవకాశం ఉన్నదని అంటున్నారు.