హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేసేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తంచేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వ్యక్తులపై కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో సెక్యులరిజాన్ని కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను కోర్టులు తీసుకున్నాయని, రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై కూడా ఉంటుందన్న విషయాన్ని మరువకూడదని చెప్పారు. దేశ లౌకికతత్వంతోపాటు భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమని, కానీ ఇటీవలి కాలంలో దేశంలో అశాంతిని పురిగొల్పేవిధంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడేందుకు దోహదపడుతుందని పేరొన్నారు.