నిర్మల్ : రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్మల్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరై, సైన్స్ఫేర్ను ప్రారంభించారు. స్థానిక సెయింట్ థామస్ స్కూల్ నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను నిర్వహిస్తుండగా.. జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వివరాలను విద్యార్థులు, గైడ్ టీచర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్పైర్ విజేతలతో పాటు గైడ్ టీచర్లు ఈ సైన్స్ ఫేర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు.. భవిష్యత్లో అనేక ఆవిష్కరణలు చేయాలని న్నారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయికి 50 ఎగ్జిబిట్లను పంపనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ వేదికలై జపాన్, కంబోడియా దేశాల్లోనూ సత్తాచాటారన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన రాణించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.
సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొని రాణించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే మెదడుకు పదును పెడితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ప్రదర్శన నిర్మల్లో నిర్వహించడం ఎంతో హర్షదాయకం అన్నారు.
హైదరాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతంలో నిర్వహించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శనలో పాల్గొంటున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో బాసర ట్రిపుల్ ఐటీ రూపురేఖలు మారిపోయాయన్నారు.జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముశ్రఫ్ పారూఖీ అలీ, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.