Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నలుదిశలా జల ప్రగతి ప్రవాహం కొనసాగుతున్నది. నదీ జలాలు బీళ్లకు ఎదురెక్కుతున్నాయి. మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగునీళ్లు.. వెరసి 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణమైంది. సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ఈ అపూర్వ జల విజయంలో సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక భూమిక. రికార్డు సమయంలో భారీ ప్రాజెక్టును పూర్తిచేయడం ఒక విశేషమైతే, దాని ఫలాలు తెలంగాణ అంతటికీ అందుతుండటం మరో విశేషం.
నాడు.. గోదావరి నుంచి 90 టీఎంసీలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేని దుస్థితి నుంచి నేడు గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకొనేస్థాయికి ఎదిగామంటే సాధించిన ప్రగతి ఎంతో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా కాకతీయ కాలువ చివరి ఆయకట్టుకూ గోదావరి నీళ్లు అందుతున్నాయంటే కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. మరోవైపు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను సైతం ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పూర్తి చేస్తున్నది.
నాడు కరువుకు కేరాఫ్ అడ్రస్గా మారిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఏకంగా 4 ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కోయిల్సాగర్ ద్వారా 50,250 ఎకరాలు తడుస్తున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.85 లక్షల ఎకరాలకు జీవం వచ్చింది. రాజీవ్ భీమా ద్వారా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కాళేశ్వరంతో కరువు ప్రాంతం నీళ్లతో కళకళలాడుతున్నది. బీడు భూముల్లో పసిడి పంటలు పండుతున్నాయి. సాగు విస్తీర్ణం అమాంతం రెట్టింపయ్యింది. 2014-15లో యాసంగి, వానాకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదనంగా ఏటా 15-20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుండటం తెలంగాణ సాగునీటిశాఖ సాధించిన ప్రగతికి నిదర్శనం.
2.09 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో 2014-15లో 1.31 కోట్ల ఎకరాలున్న సాగు విస్తీర్ణం.. 2022-23 వరకు 2.09 కోట్ల ఎకరాలకు చేరుకొన్నది. 2015-16లో 1.21 కోట్ల ఎకరాలు, 2016-17లో 1.48 కోట్లు, 2017-18లో 1.50 కోట్లు, 2018-19లో 1.43 కోట్లు, 2019-20లో 1.88 కోట్లు, 2020-21లో 2.04 కోట్లు, 2021-22లో 1.95 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం నమోదయ్యింది. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో తెలంగాణ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు రూ.38,405.2 కోట్లు కాగా.. తొమ్మిదేండ్లలో 2014 నుంచి 2023 వరకు ప్రాజెక్టులపై తెలంగాణ సరారు వెచ్చించిన మొత్తం రూ.1.69 లక్షల కోట్లు కావడం విశేషం. 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగు విస్తీర్ణ శాతం 7.7% కాగా.. 9 ఏండ్లలో తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం శాతం 117%. పెరిగిన సగటుభూగర్భ జల మట్టం 4.14 మీటర్లు.
తెలంగాణ సర్కారు ఒకవైపు కొత్త ప్రాజెక్టులను చేపట్టడమేగాకుండా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, మిడ్ మానేర్, సింగూరు కెనాల్స్, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రంభీం మత్తడి వాగు, నీల్వాయి, జగన్నాథపూర్ తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పంథాను అనుసరిస్తున్నది. అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నది.
ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్వేర్, మొబైల్ యాప్లను రూపొందించింది. పంప్హౌజ్లు, జలాశయాలు, కాలువలు, చెరువులు, వర్షపాతం వివరాలు, నదుల ఇన్ఫ్లో, భూగర్భ జలాల పరిస్థితి తదితర సమస్త సమాచారం అంతా ఒకే చోట లభ్యమయ్యేలా వాటిని తీర్చిదిద్దింది. జలాశయాలు, చెరువుల్లో ఎంత నీరు ఉన్నది? ఎంత ఖాళీ ఉన్నది? నదుల్లోకి వచ్చే నీటిని, కిందికి విడుదల చేసే నీటి పరిమాణాన్ని అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందులో పొందుపరచడం విశేషం. ఇలా.. కరువు పరిస్థితులు తలెత్తకుండా నిత్యం జలధారలతో భూములు తడిసేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. సాగువెతలు తీరాయి. నీటి కరువు తొలగిపోయింది. తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ సాగు నీటిరంగం మరింత విస్తృతమై నీటి నిల్వలు సమృద్ధిగా ఉండే ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించడంతోపాటు ఆ దిశగా ముందుకు సాగుతున్నది.
నేడు నియోజకవర్గాలవారీగా కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు నేడు సాగునీటి దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ ప్రాజెక్టులు, డ్యాంలను విద్యుద్దీపాలతో అలంకరించగా అవి శోభాయమానంగా వెలుగులీనుతున్నాయి. రాష్ట్రస్థాయిలో నేడు రవీంద్రభారతిలో సాగునీటి దినోత్సవ వేడుకలను నిర్వహించనుండగా, అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
సాగునీటి దినోత్సవంలో భాగంగా తొమ్మిదేండ్ల కాలంలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై నియోజకవర్గాలవారీగా రూపొందించిన నివేదికలను వెల్లడించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్కాకతీయ పథకం, సాధించిన ఫలితాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు. అన్నారం బరాజ్ వద్ద ప్రత్యేకంగా లేజర్ షోను కూడా ఏర్పాటు చేయడం విశేషం. సాగునీటి దినోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఈఎన్సీ, సీఈ, ఎస్ఈతోపాటు ఒక విశ్రాంత ఇంజినీర్, టెరిటోయరిల్ స్థాయిలో ఈఈ, డీఈఈ, ఏఈతోపాటు ఒక విశ్రాంత ఇంజినీర్కు అవార్డులను ప్రదానం చేయనున్నారు. జిల్లాలవారీగా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వేడుకలను విజయవంతం చేయాలని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. ఉత్సవ ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు.