హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో హైదరాబాద్ జ్యుయెల్లరీ హబ్గా మారుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలోనే బంగారం, వజ్రాల రంగంలో ప్రముఖ సంస్థ మలబార్ తమ అతిపెద్ద రిఫైనరీ, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మాదాపూర్లోని ఓ హోటల్లో శనివారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాన్యుఫాక్చరింగ్, రిఫైనరీ యూనిట్కు సంస్థ చైర్మన్ అహ్మద్తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మలబార్ సంస్థ రూ.750 కోట్ల పెట్టుబడితో 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నదని, దీనిద్వారా 2,750 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ‘నారాయణ్పేటలో జ్యుయెల్లరీ మేకింగ్కు ప్రత్యేకత ఉందని, బంగారం మార్కెట్ (గోల్డ్ సూక్)ను అక్కడ ఏర్పాటు చేయాలని కొన్ని నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోరారు. నేను ఆశ్చర్యపోయి బంగారం నగలు తయారు చేయడానికి నారాయణ్పేట ప్రసిద్ధిగాంచడం ఏంటని ప్రశ్నించాను.
హైదరాబాద్, బీదర్, రాయచూర్ నుంచి వినియోగదారులు నారాయణ్పేట వస్తారని, అక్కడ బంగారంతో నగలు బాగా తయారు చేయగలిగే కళాకారులున్నారని ఆయన నాతో చెప్పారు’ అని ఈ సందర్భంగా మంత్రి గుర్తుకుతెచ్చుకున్నారు. తాను దుబాయ్లో మాత్రమే బంగారం మార్కెట్(సూక్)ను చూశానని చెప్పారు. కాగా, మలబార్ సంస్థను స్థాపించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి 30 ఏండ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా ఈ యూనిట్ను పూర్తిచేస్తే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవచ్చన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 17 మలబార్ రిటైల్ షోరూంలున్నాయి. వీటిల్లో 1,000 మందికిపైగా పనిచేస్తున్నారు. కాగా, తమ రిటైల్ షాపులను మరింత విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులోభాగంగానే 2023 ఆర్థిక సంవత్సరంలో 97 షోరూంలను కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే దేశంలో 60, విదేశాల్లో 37 షోరూంలను ఏర్పాటు చేయనున్నారు. మలబార్లో 4 వేలకుపైగా వాటాదారులుండగా, వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ను అమలు చేస్తున్నది. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మలబార్ సంస్థ ఉపాధ్యక్షుడు అబ్దుల్ సలాం, ఇండియా ఆపరేషన్స్ ఎండీ ఉషర్ తదితరులు పాల్గొన్నారు.
‘మలబార్ను స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని ఇతర సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నది. వీటన్నింటి ద్వారా హైదరాబాద్ జ్యుయెల్లరీ హబ్గా తయారవుతుంది. జెమ్స్, జ్యుయెల్లరీ రంగాలను ముఖ్యమైన రంగాల్లో ఒకటిగా ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తున్నది. తెలంగాణలో వేలమంది స్వర్ణకారులున్నారన్నారు. టెక్నాలజీ, బయాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, జెమ్స్, జ్యుయెల్లరీ, టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, ఫుడ్ప్రాసెసింగ్ తదితర రంగాలను ప్రోత్సహిస్తే స్థానికులకు ఇంకా ఉపాధి అవకాశాలు లభిస్తాయి’
– కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎంతో దూరదృష్టి ఉన్నది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే తపన కనిపిస్తున్నది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం అనే విజన్తో ముందుకెళ్తున్నారు. తక్కువ సమయంలోనే మాకు అన్ని అనుమతులు వచ్చాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణలో తయారీ యూనిట్ మేక్ ఇన్ ఇండియా, మార్కెట్ టూ ది వరల్డ్ అనే మా మిషన్కు ఊతమిస్తుంది. ఇక్కడ అనేక సానుకూలతలున్నాయి’
-అహ్మద్, మలబార్ సంస్థ చైర్మన్