హైదరాబాద్, సెప్టెంబర్22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలను, 33 గురుకులాలను మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు తెలంగాణ ప్రాంతంలో 19 గురుకులాలు మాత్రమే ఉన్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ విస్తృతంగా గురుకులాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ గురుకులాలను సైతం పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయగా, ప్రస్తుతం రాష్ట్రంలో 262 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక డిగ్రీ కాలేజీ అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్న నేపథ్యంలో గురుకులాలకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అదనంగా మరిన్ని బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా జిల్లాకు ఒకటి చొప్పున 33 గురుకుల పాఠశాలలను, 15 డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపగా, ప్రభుత్వం ఆమోదించింది. నూతనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు మంజూరు చేయడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేస్తుండటంతో బీసీ విద్యార్థుల చదువులకు భరోసా ఏర్పడిందని కొనియాడారు.