హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అవకాశం ఇచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్న సభ్యులను ఎంపిక చేసిన సర్కారు.. బడుగులకు కూడా అవకాశం ఇచ్చింది. చైర్మన్, ఏడుగురు సభ్యుల ఎంపికలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరించారు. అత్యంత గోప్యత పాటిస్తూనే, వివాదరహితులైన విజ్ఞులు, అనుభవజ్ఞులకు కమిషన్లో చోటు కల్పించారు. వారిలో మెజారిటీ ఉద్యమకారులే. ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఒకరు టీచర్. ఇంకొకరు డాక్టర్, మరొకరు ఇంజినీర్. ప్రొఫెసర్, ప్రభుత్వ అధికారి, జర్నలిస్టు ఉన్నారు. నియమితులైన వారికే తెలియకుండా, వారి నుంచి బయోడాటాలు తీసుకొని సభ్యులుగా అవకాశం ఇచ్చారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు తమకు తెలియదని చైర్మన్ సహా కొత్త సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యంగా చైర్మన్గా డాక్టర్ బీ జనార్దన్రెడ్డిని నియమించి అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టారు. అటెండర్ నుంచి అధికారి వరకు అందరినీ సమానంగా గౌరవించడం, ఉద్యోగాన్ని ప్రేమించడం (ఐ లవ్ మై జాబ్), ఏ రోజు ఫైళ్లు ఆ రోజే వేగంగా క్లియర్ చేయటం వంటి సంస్కరణలకు ఆద్యుడైన ఆయన్ను చైర్మన్గా నియమించడం టీఎస్పీఎస్సీకి ప్రభుత్వమిచ్చిన ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్తున్నది.
సభ్యుల నియామకంలోనూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. విద్యావేత్త ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, రెవెన్యూ అధికారిగా అపార అనుభవమున్న అరుణకుమారికి అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సేవలందించిన డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్రావు, తెలంగాణ ఉద్యమం, సహా ఉద్యోగ సంఘాల నేతగా పనిచేసిన కారం రవీందర్రెడ్డి ఎంపికచేసింది. ఇంజినీర్గా మున్సిపల్శాఖలో అత్యన్నత హోదాలో పనిచేసి, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా చేపట్టిన ఎస్సార్డీపీ అమలు సహా అర్బన్ మిషన్ భగీరథ పథకాల అమలులో కీలక పాత్రపోషించిన ధన్సింగ్కు, తెలంగాణ సామాజిక సమస్యలు, నీటిపారుదల రంగంపై అనుభవము న్న మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణకు చోటు కల్పించింది. ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన సామాన్య టీచర్ సుమిత్ర ఆనంద్ తనోబాను సభ్యురాలిగా నియమించి ఆయా వర్గాలు, ఉద్యోగులు, ఉద్యమకారులకు తగు ప్రాధాన్యం ఇచ్చింది.