KCR Kit | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గర్భిణులు ఆరోగ్యంగా ఉంటూ, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతూ సురక్షిత ప్రసవం అయ్యేందుకు సహాయం చేస్తున్న ‘కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’లను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పేరును ‘ఎంసీహెచ్ కిట్’గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. అయితే కేసీఆర్ కిట్తో ఉన్న ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తారా? లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. గతంలో గర్భిణిగా పేరు నమోదైనప్పటి నుంచి ప్రసవం అయ్యి, పిల్లలకు వ్యాక్సిన్లు పూర్తయ్యే నాటికి గర్భిణులకు ప్రభుత్వం రూ.12 వేలు ఆర్థిక సాయం అందించేది. అమ్మాయి పుడితే మరో రూ.1000 అదనంగా ఇచ్చేది. దీంతోపాటు తల్లికి, బిడ్డకు కావాల్సిన నిత్యావసరాలతో కూడిన కిట్ అందించేంది. దీని ఖరీదు దాదాపు రూ.2 వేలు. ఇలా సుమారు 13 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ పాలనలో ఆర్థిక సహాయం అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేరును ‘ఎంసీహెచ్ కిట్’గా పేరు మార్చింది. అయితే రూ.13 వేల ఆర్థిక సాయం, రూ.2 వేలు విలువైన వస్తువుల కిట్ను కొనసాగిస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికైతే గర్భిణుల పేర్లు నమోదు చేస్తున్నామని, ఆర్థిక సాయం ఎంత అనేదానిపై ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్తున్నారు. కేంద్రం ఇచ్చే రూ.5 వేల సాయంతో సరిపెడతారని కొందరు చెప్తుండగా, పేరు మార్చి కొనసాగిస్తారని మరికొందరు పేర్కొంటున్నారు.
అయిపోయిన కిట్లు
గర్భిణులను పోషకాహార లోపం, రక్త హీనత నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ పథకానికి గతంలో రూపకల్పన చేసింది. రక్తహీనత అధికంగా నమోదైన 9 జిల్లాల్లో మొదటి దశ కింద 2022, డిసెంబర్ 21వ తేదీన పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో సుమారు 1.25 లక్షల మంది గర్భిణులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గత ఏడాది జూన్ 14 నుంచి మిగతా 24 జిల్లాల్లోనూ కిట్లు పంపిణీని నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కిట్లో 8 రకాల వస్తువులుంటాయి. కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూరం, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి.
ప్రతి గర్భిణీకి రెండు కిట్లు అందజేస్తారు. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య నిర్వహించే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండోసారి ఈ కిట్ను ఇస్తారు. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.2 వేలు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. గతంలో కొనుగోలు చేసిన కిట్ల నిల్వలు అయిపోయాయి. కొత్తగా కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని అధికారులు చెప్తున్నారు. పథకాన్ని నిలిపివేస్తారో, కొత్త పేరుతో కొనసాగిస్తారో తెలియడం లేదని చెప్తున్నారు. దీంతో వేలమంది గర్భిణులకు కిట్స్ పంపిణీ ఆగిపోయిందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కిట్స్ కొనుగోలుకు చొరవ చూపాలని కోరుతున్నారు.