జగిత్యాల/ధర్మారం, జనవరి 5, (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ అని, ఉద్యోగాలిచ్చే పార్టీ బీఆర్ఎస్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుంటే బండి సంజయ్ కండ్లు మండుతున్నాయని, కుళ్లుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. యువకులకు రాజకీయాలు తప్ప ఉద్యోగాలు వద్దా? దీనిపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని అన్నారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి హరీశ్రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. బీజేపీ నాయకుల వ్యవహారం మాటలు మూరెడు.. చేతలు బెత్తెడు అన్న చందంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేని బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉద్రిక్తతలు, మత కలహాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులది రాజకీయ ఆరాటమని, బీఆర్ఎస్ది యువతకు బతుకుదెరువు చూపించే పోరాటమని చెప్పారు. 2023 సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ తెలంగాణగా మార్చివేసిందని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 1.42 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ప్రక్రియ నడుస్తున్నదని చెప్పారు.
ప్రతి లక్ష జనాభాకు 18 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో, 7 పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉన్నదని మంత్రి హరీశ్రావు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఒక్కసారే 950 మంది డాక్టర్లను నియమించామని చెప్పారు. ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 90 మంది వైద్యులు వచ్చారని చెప్పారు. వైద్య విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. హెల్త్ సెక్టార్లో తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మన వైద్య సేవలపై కేంద్రమంత్రి మహేంద్రనాథ్ ఏదేదో మాట్లాడారని, వారి పాలనలోని ఉత్తరప్రదేశ్ వైద్య సేవల్లో ఆఖరి స్థానంలో ఉంటే, తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకూ 6,431 డాక్టర్లు, 7,600 స్టాఫ్ నర్సులు, 5,192 పారా మెడికల్ సిబ్బంది, 1900 మంది ఇతర సిబ్బంది, మొత్తం 21,200 మందిని కొత్తగా నియమించామని తెలిపారు. బండి సంజయ్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల కూడా ఎందుకు తీసుకురాలేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో రైతులను గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ రైతులను అరిగోస పెట్టాయని, రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. నాడు వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు.. నేడు ఖమ్మం జిల్లాకు వచ్చి రైతుల మేలు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. ఇక బీజేపీ సైతం రైతుల గురించి కల్లబొల్లి మాట్లాడడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వెంట పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, హైకోర్టు జడ్జి పొనుగోటి నవీన్రావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్లు, రాణవేని సుజాత, అన్నం లావణ్య తదితరులు పాల్గొన్నారు.