మల్యాల, డిసెంబర్ 7: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు బుధవారం పూజలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా ఉన్నారు. కొండగట్టు ఆలయ ప్రాంగణంలోని హరిత హోటల్కు మంగళవారం రాత్రి చేరుకుని బస చేశారు. బుధవారం వేకువజామున ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు, మంత్రి, ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో అంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధాన ఆలయంలోని వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం బేతాళస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.