హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా తెలంగాణలో పీఆర్సీ ఇచ్చామని రాష్ట్ర ఎైక్సెజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉద్యోగుల పీఆర్సీపై బీజేపీ నేతలు అవగాహన లేకుం డా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలోనే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉంటే చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. గన్పార్క్ వద్ద బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాత పెన్షన్ తీసివేస్తే సీఎం కేసీఆర్ మాత్రం పెన్షన్ స్కీం పునరుద్ధరించారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 14 శాతం పీఆర్సీ ఇచ్చారన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం 73 శాతం పీఆర్సీ ఇచ్చిందని స్పష్టంచేశారు. గుజరాత్లో పది సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పీఆర్సీ ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో తాము పోరాటం చేసే వాళ్లమని కానీ తెలంగాణ వచ్చాక అంతకంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పారు. హోంగార్డులకు దేశంలో ఎక్కడాలేని విధంగా జీతాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఒకే నెలలో 32 వేల మందికి పదోన్నతులు కల్పించిన ఘనత కూడా సీఎం కేసీఆర్దేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను ఇస్తున్నదని చెప్పారు. ప్రైవేటు రంగంలో కూడా యువతకు ఉపాధిని సృష్టిస్తున్నామని తెలిపారు. వంద స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ నేతలు అడ్డగోలుగా, ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాము దేవాలయాలను కడుతాం కానీ వాటిని రాజకీయ లబ్ధికోసం వాడుకోబోమని మంత్రి స్పష్టంచేశారు.