తిరుమల/హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారి ఎగబడటంతో తోపులాట చోటుచేసుకున్నది. రెండురోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేసి మంగళవారం తెరువడంతో భక్తులు ఒకేసారి క్యూలైన్లలో తోసుకురావడంతో ఈ ఘటన జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రం వద్ద రెండురోజుల తర్వాత టోకెన్ల కౌంటర్లు తెరవడంతో అక్కడ వేచి ఉన్న భక్తులతోపాటు కొత్తగా భక్తులు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకున్నది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజు దర్శన టోకెన్లు లేకు న్నా తిరుమలకు టీటీడీ అధికారులు భక్తులను పంపించారు. టోకెన్లు తీసుకున్నవారిని తొలుత, మధ్యాహ్నం 2 గంటల తర్వాత టోకెన్లు తీసుకోని వారిని కూడా కంపార్టుమెంట్లలోకి అనుమతించారు. రెండేండ్ల తర్వా త భక్తులను వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించారు. ప్రస్తుతం రద్దీ దృష్ట్యా దర్శన టికెట్లు లేని భక్తులను లేపాక్షి వద్ద నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారం నుంచి తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల పంపిణీని నిలిపివేశారు.