హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో ఫంక్షనల్ వర్టికల్స్ (పని విభజన అంశాలు)లో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న సిబ్బందికి ఇకపై ప్రతి నెలా ఆయా యూనిట్ల వారీగా పురస్కారాలు దక్కనున్నాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్శాఖలో ఫంక్షనల్ వర్టికల్స్ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 17 అంశాల్లో ఉత్తమ పనితీరుకు ప్రశంసాపత్రంతోపాటు జీఎస్ఈ (గుడ్ సర్వీస్ ఎంట్రీ) లేదా క్యాష్ రివార్డులు ఇవ్వనున్నారు. పోలీసుల పనితీరు మరింత మెరుగుపర్చి.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఉన్నతాధికారులు ఈ నూతన విధానాన్ని ఈ నెల నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ప్రతి అంశం ఆధారంగా అన్ని యూనిట్లలోని పోలీస్ సిబ్బంది, అధికారుల పనితీరును కేపీఐ (కీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్) ద్వారా గుర్తిస్తున్నారు. సిబ్బంది పనితీరుపై నివేదికలు ఆయా యూనిట్ల అధికారులకు ప్రతి నెలా 21 వరకు పంపిస్తారు. వీటి నుంచి ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బంది ఎంపిక బాధ్యత ఆయా యూనిట్ అధికారికి ఉంటుంది. ప్రతి నెలా 25వ తేదీ నాటికి సిబ్బందికి ఈ రివార్డులు అందజేస్తారు.