హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది. రాష్ట్రంలో ఉన్న మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నాయి. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఒప్పందం మేరకు రానున్న రెండేళ్లలో తెలంగాణలో రూ.1000కోట్లు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్లను కేవలం భారత్తో పాటు ఏషియా పసిఫిక్ రీజియన్కు సైతం ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో తమ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్లను తయారు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. కంపెనీ పెడుతున్న రూ.1000కోట్ల పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్ కంపెనీకి అత్యంత ప్రాధాన్యంగా మారబోతున్నదని అని కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు. తమ కంపెనీ ఏసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంస్థకు అందిస్తున్న సహకారం హర్షం వ్యక్తం చేశారు.