హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) :ఎస్సెస్సీ పరీక్షా సమయాన్ని అరగంట పెంచామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు. బుధవారం పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయంలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. గతంలో 2.45ని॥ల పరీక్షా సమయం ఉండగా, అరగంట పెంపుతో మొత్తం 3.15ని॥ల పాటు కొనసాగనున్నదని తెలిపారు. ఐదు లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమైనందున ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. 70 శాతం సిలబస్నే అమలుచేస్తున్నామని, ప్రశ్నపత్రంలో అధిక చాయిస్ ఇస్తున్నామని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, వసతులను కల్పించడం కోసం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మూడేండ్లలో అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని పేర్కొన్నారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. టెట్ పరీక్షా కేంద్రాల ఎంపిక, నిర్వహణలోనూ ఇబ్బందులు రావొద్దని అధికారులకు మంత్రి సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన ఇతర అధికారులు పాల్గొన్నారు.