హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తిరుమలలో అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ సోమవారం విడుదల చేయనున్నది. ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే అంగప్రదక్షణ టోకెన్లతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టోకెన్లను కూడా విడుదల చేయనున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శన టికెట్లు కూడా సోమవారమే విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలలో రోజుకు 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొన్నది. మంగళవారం రోజు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను మంగళవారం టీటీడీ విడుదల చేయనున్నది. తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబర్ నెల గదుల సమాచారాన్ని ఈ నెల 26న ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.